చైనాలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి… 12 మంది మృతి

V. Sai Krishna Reddy
1 Min Read

చైనాలో నిర్మిస్తున్న ఓ భారీ రైల్వే వంతెన నిర్మాణంలో ఉండగానే కుప్పకూలింది. యెల్లో రివర్‌పై శుక్రవారం జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురి ఆచూకీ గల్లంతైంది.

సిచువాన్-కింగ్‌హై రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సైట్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌తో సహా మొత్తం 16 మంది ఉన్నట్లు ‘పీపుల్స్ డైలీ’ వెల్లడించింది. స్టీల్ కేబుల్ తెగిపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

చైనాలో రెండో అతిపెద్ద నది అయిన యెల్లో రివర్‌పై నిర్మిస్తున్న తొలి రైల్వే స్టీల్ ట్రస్ ఆర్చ్ బ్రిడ్జి ఇదే కావడం గమనార్హం. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద స్పాన్ డబుల్-ట్రాక్ స్టీల్ ట్రస్ ఆర్చ్ బ్రిడ్జిగానూ ఇది గుర్తింపు పొందింది. వంతెనకు చెందిన ప్రధాన ఆర్చ్ భాగం ఒక్కసారిగా నదిలో కూలిపోయిన దృశ్యాలను చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ) ప్రసారం చేసింది. సమాచారం అందుకున్న వెంటనే వందలాది మంది సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

చైనాలో భద్రతా ప్రమాణాల అమలు బలహీనంగా ఉండటంతో ఇలాంటి నిర్మాణ ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయని విమర్శలు ఉన్నాయి. గతేడాది డిసెంబర్‌లో కూడా షెన్‌జెన్‌ నగరంలో ఓ రైల్వే నిర్మాణ ప్రదేశం కూలి 13 మంది కార్మికులు గల్లంతైన విషయం తెలిసిందే.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *