విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండాలి: డి.ఎస్.పి శ్రీధర్రెడ్డి
కోదాడ టౌన్,జూన్ 24 (ప్రజా జ్యోతి): విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉంటూ చదువు, క్రీడలపై దృష్టి సారించాలని డీఎస్పీ ఎం. శ్రీధర్ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణ పరిధి కొమరబండ శివారులోని తేజ విద్యాలయంలో మంగళవారం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ అనర్ధాలు అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజంలో మంచి వ్యక్తిగా ఎదగాలంటే మంచి అలవాట్లు అలవాల్చుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మత్తుతో అనేక అనర్ధాలు ఉన్నాయని, వాటితో ఎంతో మంది జీవితాలు పాడైపోయినట్లు తెలిపారు. విద్యార్థులు ఇంట్లో, పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు డ్రగ్స్, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలను వివరించి వారిలో పరివర్తనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ రజిత రెడ్డి, అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.