దేశంలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. 2025 ఏప్రిల్ నెలకు గాను రికార్డు స్థాయిలో రూ. 2.37 లక్షల కోట్లు వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలలో ఇంత భారీ మొత్తం వసూలు కావడం ఇదే తొలిసారి.
2024 ఏప్రిల్ నెలలో నమోదైన రూ. 2.10 లక్షల కోట్ల వసూళ్లే ఇప్పటివరకు అత్యధికం కాగా, తాజా గణాంకాలు ఆ రికార్డును అధిగమించాయి. గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే ప్రస్తుత వసూళ్లలో 12.6 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతకుముందు నెల, అంటే 2025 మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఏప్రిల్ నెల మొత్తం వసూళ్లలో దేశీయ లావాదేవీల ద్వారా సమకూరిన పన్ను మొత్తం రూ. 1.9 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 10.7 శాతం అధికం. అదేవిధంగా, దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 46,913 కోట్లుగా నమోదైంది. ఈ విభాగంలో వృద్ధి 20.8 శాతంగా ఉంది.
ఇక రూ. 27,341 కోట్ల రిఫండ్లను జారీ చేసిన అనంతరం, నికర జీఎస్టీ వసూళ్లు రూ. 2.09 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నికర వసూళ్లలో వృద్ధి 9.1 శాతంగా ఉందని కేంద్రం తెలిపింది.
దేశంలో వివిధ పరోక్ష పన్నుల స్థానంలో 2017 జులై 1 నుంచి జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలి నెలలో వసూళ్లు సుమారు రూ. 92 వేల కోట్లుగా నమోదయ్యాయి. ఆరంభంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ, 2018 ఏప్రిల్లో తొలిసారిగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయల మార్కును దాటాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో వసూళ్ల వేగం కొంత తగ్గినా, 2022 ఏప్రిల్ నుంచి తిరిగి పుంజుకున్నాయి.
అప్పటి నుంచి దాదాపు ప్రతినెలా రూ. 1.50 లక్షల కోట్ల పైనే వసూళ్లు నమోదవుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ లో తొలిసారి జీఎస్టీ వసూళ్లు రూ. 2 లక్షల కోట్ల మార్కును (రూ. 2.10 లక్షల కోట్లు) దాటగా, సరిగ్గా ఏడాది తర్వాత ఈ ఏప్రిల్ లో ఆ రికార్డును అధిగమించి రూ. 2.37 లక్షల కోట్లతో సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేయడం విశేషం