న్యాయవాదుల సహకారం మరువలేనిది…..

Nalgonda Bureau
3 Min Read

న్యాయవాదుల సహకారం మరువలేనిది…..

 

-సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యామ్ కుమార్

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 21 (ప్రజా జ్యోతి)
న్యాయమూర్తిగా తాను తన విధులను నిర్వర్తించిన మూడు సంవత్సరాల కాలంలో హుజూర్ నగర్ న్యాయవాదులు తనకు అందించిన సహకారం మరువలేనిదని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యామ్ కుమార్ అన్నారు. బదిలీపై వెళ్తున్న ఆయనకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం వీడ్కోలు సభ నిర్వహించి న్యాయమూర్తి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 2022వ సంవత్సరంలో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 1 0 6 7 కేసులు పెండింగ్ లో ఉన్నాయని అట్టి కేసులను 300 కు తీసుకువచ్చానన్నారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసుల భారం అధికంగా ఉండటంతో అక్కడినుండి 500 కేసులు ఈ కోర్టుకి బదిలీ చేయబడ్డాయని ప్రస్తుతం ఆ కేసులతో కలుపుకొని ఈ కోర్టులో 800 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. 2014లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం కాగా తాను పదవీ బాధ్యతలు స్వీకరించేటప్పటికి కొన్ని కేసులు న్యాయమూర్తి ముందుకు రానే రాలేదని వాటి వాయిదాలు సెక్షన్ లోనే వేసే వారిని ఆ విధానానికి స్వస్తి చెప్పి తాను అన్ని కేసులను న్యాయమూర్తి ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నానన్నారు. 10 సంవత్సరాలకు పైగా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి పెండింగ్ కేసుల సంఖ్యను సున్నా కు తీసుకొచ్చానని అందుకుగాను హైకోర్టు న్యాయమూర్తులు తనకు ప్రశంసా సర్టిఫికెట్ ఇచ్చారని ఆ ప్రశంస సర్టిఫికెట్ పొందడానికి పూర్తి సహకారం అందించింది ఇక్కడి న్యాయవాదులేనన్నారు. కేసులో ఉన్న సాక్షాథారాలను బట్టి తీర్పులు వెలువరించవలసి ఉంటుందని దానిలో భాగంగా కొన్ని కేసులలో శిక్షలు కూడా విధించానని అది తన ఉద్యోగ ధర్మంగా చేసింది తప్ప వ్యక్తిగతం కాదన్నారు. భూ సేకరణలో తమ ఆస్తులను పోగొట్టుకొని పరిహారం పొందడానికి సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతున్న రైతుల బాధలను గుర్తించి వారి కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రయత్నించానన్నారు. తన పదవీకాలంలో హుజూర్ నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయస్థానం, అదనపు జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం, కోదాడ సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాల ప్రారంభోత్సవాలలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జూనియర్ న్యాయవాదులు వృత్తిపరంగా మెలకువలు నేర్చుకొని ఉన్నత న్యాయస్థానాలు విలవరిస్తున్న తీర్పులను నిరంతరం చదివి న్యాయవిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల కొరత అధికంగా ఉందని నోటిఫికేషన్ వేసిన పోస్టులకు సరిపడ అభ్యర్థులు క్వాలిఫై కాకపోవడం మూలంగా న్యాయమూర్తుల భర్తీ చేయడం సాధ్యం కావడం లేదని జూనియర్ న్యాయవాదులు కష్టపడి చదివి న్యాయమూర్తి పోటీ పరీక్షలలో పాల్గొని న్యాయమూర్తులుగా సెలెక్ట్ అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అనంతరం న్యాయవాదులు న్యాయమూర్తి దంపతులు జిట్టా శ్యామ్ కుమార్ లావణ్య లను గజమాల శాలువాలు బొకేలు పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రాంరెడ్డి, న్యాయవాదులు నారపరాజు శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసరావు, రవికుమార్, ఎంఎస్ రాఘవరావు, నట్టే సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్ రెడ్డి, ధూళిపాళ శ్రీనివాస రావు, కుక్కడపు బాలకృష్ణ, చల్లా కృష్ణయ్య, జక్కుల నాగేశ్వరరావు, మీసాల అంజయ్య, ఏజీపీలు రేణుకా దేవి, సురేష్ కుమార్, మహిళా న్యాయవాదులు సుంకరి ప్రదీప్తి, కోలా రమాదేవి, మంత్రి ప్రగడ దీపిక, జుట్టుకొండ సంధ్య, పాతపాటి శృతి పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *