తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 10 విమానాలను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖపట్నంతో పాటు ముంబై, బెంగళూరు, కోయంబత్తూరు, కోల్కతా, కొచ్చి, వారణాసి, ఇండోర్, పాట్నా, గౌహతి వెళ్లవలసిన విమాన సర్వీసులను రద్దు చేస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండు మూడు రోజులుగా పొగమంచు కమ్ముకుంటోంది. ఈరోజు హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారులపై కూడా దట్టమైన పొగ మంచు అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగమంచు కారణంగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై పలు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. శంషాబాద్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
