స్థానికులకు టీటీడీ గుడ్ న్యూస్.. వైకుంఠ దర్శనంపై కీలక ప్రకటన

V. Sai Krishna Reddy
1 Min Read

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న స్థానిక భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి ప్రత్యేక కోటా కింద దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. జనవరి 6, 7, 8 తేదీల్లో దర్శనం కోసం రోజుకు 5,000 చొప్పున టోకెన్లు కేటాయించనుంది.

ఈ టోకెన్ల కోసం ఆసక్తి ఉన్న స్థానికులు నేటి నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా వాట్సాప్ ద్వారా 1+3 విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి వాసులకు రోజుకు 4,500 టోకెన్లు, తిరుమలలో నివసించేవారికి 500 టోకెన్లు కేటాయిస్తారు. నమోదు చేసుకున్న వారిలో నుంచి ‘ఈ-డిప్’ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి, ఈ నెల‌ 29న మధ్యాహ్నం 2 గంటలకు వివరాలు ప్రకటిస్తారు. స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ సూచించింది.

ఇదిలా ఉంటే.. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. జనవరి 3న పౌర్ణమి గరుడసేవ, 14న భోగి తేరు, 16న గోదా కల్యాణం, 17న పార్వేటి ఉత్సవం, 25న రథసప్తమి, జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *