నిజామాబాద్ జిల్లాలో అత్యంత పాశవికమైన సంఘటన చోటుచేసుకుంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. బాసర ప్రధాన రహదారి సమీపంలో మొండెం మాత్రమే ఉన్న మహిళ శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
వివరాల్లోకి వెళితే, దుండగులు మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆమె తలను మొండెం నుంచి వేరు చేశారు. అంతేకాకుండా, ఒక చేయి, మరో చేతి వేళ్లను కూడా నరికివేశారు. మృతదేహం నగ్న స్థితిలో పడి ఉండటం చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో ఆధారాల కోసం గాలింపు చేపట్టారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతురాలిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
కాగా, నెల రోజుల వ్యవధిలోనే ఇదే ప్రాంతంలో ఇద్దరు మహిళలు హత్యకు గురికావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనలతో తమ భద్రతపై భయం నెలకొందని వారు వాపోతున్నారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
