తెలంగాణ డీజీపీ జితేందర్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనుండటంతో రాష్ట్ర పోలీసు శాఖలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. కొత్త పోలీస్ బాస్ నియామకంతో పాటు పలు కీలక విభాగాల్లో ఉన్నతాధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో పోలీసు శాఖలో ఎవరు ఏ స్థానంలోకి వెళ్తారనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్ర నూతన డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివధర్ రెడ్డి నియామకం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఆయనకు డీజీపీగా పదోన్నతి లభిస్తే ఖాళీ అయ్యే ఇంటెలిజెన్స్ చీఫ్ పదవిలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ను నియమించే అవకాశాలున్నాయని సమాచారం.
ఈ మార్పులు కేవలం డీజీపీ స్థాయికే పరిమితం కాకుండా ఇతర కీలక పోస్టులపైనా ప్రభావం చూపనున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సీవీ ఆనంద్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా బదిలీ చేసి, ఆయన స్థానంలో అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) మహేశ్ భగవత్ పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే, హోం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను విజిలెన్స్ విభాగానికి, జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రాను హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ఉన్నత స్థాయి మార్పులతో పాటు సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి, మరికొందరు ముఖ్య అధికారులు, మూడు కమిషనరేట్ల పరిధిలోని డీసీపీలు, పలు జిల్లాల ఎస్పీలు కూడా బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ కాలాన్ని పొడిగించినట్లే, డీజీపీ జితేందర్కు కూడా కేంద్రం అనుమతితో పొడిగింపు లభించవచ్చనే ఊహాగానాలు కూడా పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి.