స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ అత్మీయ భరోసా పథకం లబ్దిదారులకు ఆర్దిక సహయాన్ని అందజేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు.ఆదివారం నాడు సిద్దిపేట పట్టణం లోని డిబిఎఫ్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్దిదారులను ఎంపిక చేసి మంత్రివర్గ సమావేశంలో చర్చించి దశల వారీగా ఆర్థిక సహాయం అందజేస్తామని ఆశలు కల్పించి విస్మరించడం తగదన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మందిని ఇందిరమ్మ అత్మీయ భరోసా పథకానికి అర్హులను గుర్తించి కేవలం 83 వేల భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఆర్థిక సహాయాన్ని మొదటి దశ 6 వేలు అందజేసిన ప్రభుత్వం మిగతా 6వేలను అందజేయాలని కోరారు. సిద్దిపేట జిల్లాలలో 16505 మందిని భూమిలేని కూలీలను గుర్తించి కేవలం 7000 మంది కూలీలకు మాత్రమే ఆత్మీయ భరోసా కింద మొదటి విడత ఆర్థిక సహాయాన్ని అందజేశారని అన్నారు. భూమి లేదని గుర్తించిన కూలీలందరికి పథకాన్ని అమలు చేసి ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలోని డిబిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్ల శంకర్, జిల్లా అధ్యక్షులు భీమ్ శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొతరాజు శంకర్, జిల్లా కోశాధికారి తిరుపతి పాల్గొన్నారు.
