జూబ్లీహిల్స్ బైపోల్ : సర్వేల్లో గెలుపు వారిదే

V. Sai Krishna Reddy
2 Min Read

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికపై రాజకీయ వేడి పీక్స్‌కి చేరింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ బైపోల్‌కి సీరియస్‌గా తలపడ్డాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ వ్యూహాలపై కసరత్తు ప్రారంభించాయి. తాజా సర్వేలో వెలుగులోకి వచ్చిన విషయాలు ఈ బైపోల్‌కు మరింత ఆసక్తికర మలుపు తీసుకొచ్చాయి. బీఆర్ఎస్‌కు ప్రతిష్ఠాత్మక బైపోల్

ఇది తమ సిట్టింగ్ సీటు కావటంతో బీఆర్ఎస్‌కు ఇది గౌరవంగా మారింది. గోపీనాథ్ కుటుంబానికి సీటు ఇవ్వాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నా, గోపీనాథ్ సతీమణి సునీత ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆమె అభ్యర్థిత్వంపై ఒక నిర్ణయానికి రాకపోతే, విష్ణు వర్ధన్ రెడ్డిని రంగంలోకి దించాలన్న ఆలోచన బీఆర్ఎస్‌దే. అయితే, సర్వేల ప్రకారం మాగంటి కుటుంబం అభ్యర్థిగా ఉండే పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు ఎక్కువ మద్దతు లభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ వ్యూహం.. ఎంఐఎం కీలకం

కంటోన్మెంట్ ఉప ఎన్నిక విజయం తరువాత కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌ను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే మాజీ క్రికెటర్, హైదరాబాదీ లీడర్ అజహరుద్దీన్ తాను పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అభ్యర్థి ఎంపిక పార్టీ హైకమాండ్ నిర్ణయమని తేల్చేశారు. ఇదే సమయంలో ఎంఐఎం పోటీ చేస్తుందా లేదా అన్నది కాంగ్రెస్‌కు కీలకంగా మారనుంది. ఎంఐఎం గెలవకపోయినా.. దాని సహకారం ఏ పార్టీకైనా ఓటు తేడాను ప్రభావితం చేసే పరిస్థితి ఉంది.

– బీజేపీకి స్ట్రాటజిక్ ప్లాన్

జూబ్లీహిల్స్‌లో బీజేపీ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త పేరు వినిపిస్తున్నా, అధికారికంగా ఎవరినీ ప్రకటించలేదు. టీడీపీ, జనసేనల మద్దతుతో ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ ఆలోచన చేస్తోంది. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఓటు బ్యాంక్ లో కొంత మార్పు రావొచ్చన్న అంచనాలున్నాయి.

-సర్వేల ప్రకారం గెలుపు తేల్చలేము

ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు సర్వేలు చేయించుకున్నాయి. కానీ ఈ సర్వేల్లో ఎవరూ ఏకపక్షంగా లేరు. ప్రజల మూడ్ ఇంకా స్పష్టంగా కనిపించకపోయినా, అభ్యర్థుల ఎంపిక తర్వాత రాజకీయ సమీకరణాల్లో మార్పు రావచ్చని నిపుణుల అంచనా. ఎంఐఎం పోటీ, కాంగ్రెస్ అభ్యర్థి నిర్ణయం, బీఆర్ఎస్ అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చిన తర్వాతే వాస్తవ గణాంకాలు బయటపడే అవకాశం ఉంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈసారి రాజకీయంగా పెద్ద పోరుగా మారుతోంది. ఈ ఉప ఎన్నిక ఫలితం గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలకు దిశానిర్దేశం చేసేలా ఉండే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్‌లో ఈ ఎన్నిక జరిగే అవకాశముండటంతో వచ్చే నెలల్లో రాజకీయ వేడి మరింత పెరగనుంది. ఇక గెలుపు గులాబీదా? చేతివాటం కమలం పార్టిదా? లేక మరోసారి కౌంటర్ కొట్టే హస్తమా? అనే దానిపై తుది తీర్పు మాత్రం ప్రజల తీర్పునే నిర్ణయిస్తుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *