కాంగ్రెస్ చెప్పిన ‘మార్పు’ ఇదేనా?: హరీశ్ రావు

V. Sai Krishna Reddy
1 Min Read

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత కొంతకాలంగా పంచాయతీలకు నిధులు అందడం లేదని, దీంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు.

గ్రామ పంచాయతీలకు గత 16 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల కావడం లేదని హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. నిధుల కొరత కారణంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను నడిపేందుకు కూడా డీజిల్ లేని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీ కార్యదర్శులు ట్రాక్టర్ల తాళాలను ఉన్నతాధికారులకు అప్పగించేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం మారితే మార్పు వస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, అయితే ఇప్పుడు గ్రామాల్లో కనిపిస్తున్న ఈ దుస్థితేనా ఆ మార్పు? అని హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. “ఇది మార్పు కాదు, ఏమార్పు” అంటూ ఆయన తన పోస్టులో ఎద్దేవా చేశారు. గ్రామ స్వరాజ్యానికి నిధుల కేటాయింపులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలకు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మాత్రం గ్రామాలకు నిధుల కటకట ఏర్పడిందని హరీశ్ రావు ఆరోపించారు. ఈ నిధుల కొరత వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *