భారతదేశం అక్షరాస్యత విషయంలో గణనీయమైన పురోగతి సాధిస్తోంది. ఏడేళ్ల వయసుకు పైన ఉన్నవారి ఓవరాల్ అక్షరాస్యత రేటు 80.9శాతంగా ఉంది. ఇది ఒక మంచి పరిణామమే. అయితే, ఈ అక్షరాస్యతతో పాటు లింగ సమానత్వాన్ని సాధించడమే మన దేశానికి పెద్ద సవాలుగా మారుతోంది. పురుషులు, మహిళల అక్షరాస్యత రేట్ల మధ్య ఉన్న అంతరం ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
మన దేశంలో ఏడేళ్ల వయసుకు పైన ఉన్నవారి అక్షరాస్యత రేటులో కొన్ని రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. మిజోరం – 98.2శాతం, లక్షద్వీప్ – 97.3శాతం, కేరళ – 95.7శాతం, గోవా – 95.3శాతం, అస్సాం/త్రిపుర: 94.2శాతంతో టాప్ ప్లేసులో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు అక్షరాస్యతలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో స్త్రీ, పురుష అక్షరాస్యతలో అంతరం చాలా తక్కువగా ఉండడం విశేషం.
భారతదేశం మొత్తం అక్షరాస్యత రేటు 80.9శాతం ఉన్నప్పటికీ, పురుషుల అక్షరాస్యత (సుమారు 84.7%), స్త్రీల అక్షరాస్యత (సుమారు 70.3%) మధ్య ఇంకా 14.4% అంతరం ఉంది. ఈ అంతరం కొన్ని రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ లింగ అంతరం కేవలం చదువుకోవడం వరకే పరిమితం కాదు. ఇది సమాజంలో మహిళల భాగస్వామ్యం, ఆర్థిక స్వాతంత్ర్యం, ఆరోగ్యం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. విద్యావంతులైన మహిళలు మెరుగైన ఆరోగ్య ప్రమాణాలను కలిగి ఉంటారు.
విద్యలో లింగ అంతరాన్ని తగ్గించడానికి మన దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. బాలికలను పాఠశాలలకు పంపడానికి కొన్ని ప్రాంతాల్లో కుటుంబాలు ఇంకా సంకోచిస్తాయి. బాలికలకు సరిపడా మరుగుదొడ్లు, సురక్షితమైన వాతావరణం ఇంకా కొన్ని ప్రాంతాల్లో లేవు. పేదరికం వల్ల బాలికలను చిన్న వయసులోనే పనికి పంపడం లేదా వివాహాలు చేసేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. ఈ సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం, సమాజం కలిసికట్టుగా కృషి చేయాలి. బాలికలకు ప్రాథమిక విద్యను పూర్తిగా ఉచితంగా, నిర్బంధంగా అందించాలి. బాలికలకు అనుకూలమైన మరుగుదొడ్లు, సురక్షితమైన వాతావరణం కల్పించాలి. బాలికా విద్య ప్రాముఖ్యతపై తల్లిదండ్రులు, సమాజంలో అవగాహన కల్పించాలి. బాలికలను పాఠశాలలకు పంపే కుటుంబాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచడం ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. అక్షరాస్యతలో లింగ సమానత్వాన్ని సాధిస్తేనే భారతదేశం నిజమైన అభివృద్ధిని సాధించగలదు.