ముక్త్యాల బ్రాంచ్ పైప్ లైన్ బాధిత రైతులతో కలెక్టర్ సమావేశం
నష్టపరిహారం పెంపు విషయమై మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ
సూర్యాపేట, ఏప్రిల్ 24 (ప్రజా జ్యోతి) :ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ పైప్ లైన్ వల్ల నష్టపోతున్న చింతలపాలెం బాధిత రైతులతో జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ బాధిత రైతులు తమ సమస్యలను మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారం లో భాగంగా బాధిత రైతులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు పైప్ లైన్ వల్ల తమ పంట భూములు ముక్కలుగా విడిపోయాయని, గతంలో శివగంగా లిఫ్ట్ పైప్ లైన్ వల్ల వచ్చిన నష్టాన్ని మళ్లీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పైప్ లైన్ పోయే భూములతో పాటు మిగిలిన ముక్కల భూములను కూడా ప్రభుత్వం సేకరించాలని, ప్రస్తుతం అందిస్తున్న భూ నష్టపరిహారం సరిపోని కారణంగా దాన్ని పెంచాలని కోరారు. స్పందించిన కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని సమీక్షించి పెంపు అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. త్వరలో హుజూర్నగర్ ఆర్డీవో ఆధ్వర్యంలో మరోసారి బాధిత రైతులతో సమావేశం ఏర్పాటు చేసి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ రమేష్ బాబు, అదనపు కలెక్టర్ రాంబాబు, హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, చింతలపాలెం తహశీల్దార్ సురేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రారెడ్డి, చింతలపాలెం బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.