తెలంగాణ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. కానీ ఈరోజు రేషన్ కార్డుల దరఖాస్తులపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో దరఖాస్తులను నిలిపివేసింది. కొత్త రేషన్ కార్డులు, మార్పులు, చేర్పుల దరఖాస్తు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోని వారు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం నిన్న శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులు కలిగి ఉన్న వారు కూడా మీసేవ కేంద్రాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు బ్రేక్ వేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.