సూర్యాపేట జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ బైపాస్లోని దుర్గాపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఒక కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే… జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు, దుర్గాపురం వద్దకు రాగానే ముందు వెళుతున్న లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను అతి కష్టం మీద బయటకు తీసి, చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో మరణించిన వారిని కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఎస్సై అశోక్, కానిస్టేబుల్ స్వామిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం అతివేగం, డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు.
ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు వారు తెలిపారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది