నల్గొండ జిల్లాలో మిస్టరీ మరణాలు… భర్త ఊరెళ్లి వచ్చేసరికి భార్య, కుమార్తె మృతి

V. Sai Krishna Reddy
1 Min Read

భర్త ఊరెళ్లి వచ్చేసరికి భార్య, కుమార్తె అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి ఓ ఫర్టిలైజర్ సంస్థలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. భార్య రాజేశ్వరి (34), కుమార్తెలు వేదశ్రీ , వేద సాయిశ్రీ (13)తో కలిసి మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. సీతారాంరెడ్డి ఈ నెల 10న సంస్థ పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లి నిన్న సాయంత్రం తిరిగి వచ్చారు.

అప్పుడే నిద్ర లేచిన పెద్ద కుమార్తె వేదశ్రీ గేటు తీసి అమ్మా, చెల్లి నిద్రపోతున్నారని చెప్పింది. దీంతో వేద సాయిశ్రీని నిద్రలేపేందుకు దుప్పటి తొలగించగా గొంతు కోసి చనిపోయి ఉంది. మరో గది లోపల గడియపెట్టి ఉండటంతో తలుపు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి చూడగా రాజేశ్వరి ఉరికి వేలాడుతూ కనిపించింది. అలాగే, ఆమె ఎడమచేతి మణికట్టు వద్ద నరం కోసి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *