ఆర్థిక నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి జైలు నుంచి లేఖ రాసి వార్తల్లో నిలిచాడు. ఈసారి అతను ఏకంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు లేఖ రాయడం గమనార్హం. మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతానంటూ ఆఫర్ ఇచ్చాడు. తన ఆఫర్ను అంగీకరించాలని లేఖలో రాసుకొచ్చాడు.
ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్… ఎక్స్ తనకు ఇష్టమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని పేర్కొన్నాడు. మస్క్ను ‘నా మనిషి’ అని లేఖలో సంబోధించాడు. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా సృష్టించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డీఓజీఈ)కి నాయకత్వం వహిస్తున్నందుకు మస్క్ను అభినందించాడు. తన కంపెనీ ఎల్ఎస్ హోల్డింగ్స్ ఇప్పటికే టెస్లా స్టాక్స్లో పెట్టుబడి పెట్టిందని, భారీ లాభాలను ఆర్జించిందని లేఖలో పేర్కొన్నాడు.
ఇటీవల తన ప్రియురాలు, బాలీవుడ్ నటి జాక్వెలిస్ ఫెర్నాండెజ్ బర్త్డే సందర్భంగా కూడా సుకేశ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆమె ఇష్టపడే సోషల్ మీడియా సైట్ కూడా ‘ఎక్స్’ అని తాజాగా మస్క్కు రాసిన తన లేఖలో సుకేశ్ పేర్కొన్నాడు.