బీజేపీలో చిచ్చురేపిన జిల్లా అధ్యక్షుల నియామకం

V. Sai Krishna Reddy
2 Min Read

బీజేపీలో చిచ్చురేపిన జిల్లా అధ్యక్షుల నియామకం

తాను సూచించిన వ్యక్తికి పదవి ఇవ్వలేదన్న ఎమ్మెల్యే

పార్టీలో వేధింపులు భరించలేకున్నానని ఆరోపణలు

ఇటీవల తెలంగాణలో బీజేపీ జిల్లా అధ్యక్ష పదవుల నియామకం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇది ఆ పార్టీలో చిచ్చు రేపినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. సీనియర్ నేతలు ఈ విషయంలో గుర్రుగా ఉన్నారు. ఒకొక్కరుగా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. తాజాగా, ఆ పార్టీ సీనియర్, ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మరింత కాక రేపుతున్నాయి. ఆయన ఏకంగా సొంత పార్టీపైనే ఆరోపణలు చేయడం గమనార్హం. రేపోమాపో ఆయన బాటలో మరికొందరు నడుస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి.

బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.. సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు. పార్టీలో చేరినప్పటి నుంచి తనను వేధింపులకు గురిచేస్తున్నారని, ఇక వాటిని తట్టుకోవడం నావల్ల కావడం లేదని ఆరోపించారు. అంతేకాదు, పార్టీకి అవసరం లేదు అనుకుంటే బయటకు వెళ్లిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని బాంబు పేల్చారు. తన సూచనలను పక్కనబెట్టి.. ఎంఐఎంతో అంటకాగిన వ్యక్తికి గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడం ఏంటని ఆయన విమర్శించారు. దళిత లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని తాను సూచించినట్టు చెప్పారు.

గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2014లో భారతీయ జనతా పార్టీలో నేను చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నా.. ఇక నా వల్ల కావడం లేదు.. పార్టీకి నా అవసరం లేదు.. వెళ్లిపో అని అంటే ఇప్పటికిప్పుడే వెళ్లిపోవడానికి సిద్ధం.. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి ఎస్సీ లేదా బీసీకి ఇవ్వాలని నేను సూచించాను.. కానీ, ఎంఐఎంతో సంబంధాలు కొనసాగించే వ్యక్తిని నియమించారు.. ఇదేంటని పార్టీకి చెందిన కీలక నేతకు ఫోన్‌ చేసి అడిగితే ఆ విషయం తనకు తెలియదని సమాధానం చెప్పారు.. ఆ జవాబుతో నా వెనుక జరుగుతున్న కుట్ర కోణం బయటపడింది..

నేను ఇప్పటి వరకు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌లతోనే పోరాటం చేస్తూ వచ్చాను…. కానీ, సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం.. జిల్లా అధ్యక్షుడి పదవి అనేది పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వ్యక్తికి ఇవ్వడం ప్రతిచోటా జరుగుతుంది… కానీ, ఇక్కడ నా సూచన ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది.. దీని సంజాయిషీ ఇవ్వాలి. వెంటనే అధ్యక్షుడిని మార్చాలి’’ అని రాజాసింగ్ డిమాండ్‌ చేశారు.

జీవితంలో నేను ధర్మ ప్రచారం, ధర్మ యుద్ధం నేర్చుకున్నా… ప్రస్తుతం పార్టీలో కొందరిలా బ్రోకరిజం నేను నేర్చుకోలేదు. వారి కారణంగా ఈ రోజు పార్టీ వెనుకబడింది.. రాష్ట్రంలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాలి. కానీ ఇలాంటి రిటైరైన వ్యక్తులు ఉంటే బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు’’ అని వ్యాఖ్యానించారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *