- వైద్యులు అవ్వాలనుకునే వారికి శుభవార్త
ఐదేళ్లలో 75 వేల సీట్ల పెంపు
వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. దేశవ్యాప్తంగా వైద్య సీట్లను పెంచబోతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు శనివారం ప్రకటించిన కేంద్ర బడ్జెట్-2025లో ఆమె పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి కనీసం 10 వేలు చొప్పున పెంచేందుకు కేంద్రం సిద్ధమైందన్నారు. ఇలా రానున్న ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచుతామన్నారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటీ)కు కూడా నిర్మలమ్మ గుడ్న్యూస్ చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. పదేళ్ల కిత్రం ఐఐటీ సీట్ల సంఖ్య 65 వేలు ఉండగా.. ప్రస్తుతం 1.35 లక్షలకు చేరింది. అంటే దాదాపు 100శాతానికిపైగా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదనపు మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ముఖ్యంగా 2014 తర్వాత ప్రారంభించిన ఐదు ఐఐటీలలో అదనంగా 6,500 మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ప్రణాళికలు వేశారు. నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యలో పెట్టుబడులపై దృష్టిసారించడంలో భాగంగా దేశవ్యాప్తంగా ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రాలను స్థాపించనున్నట్లు సీతారామన్ తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’కు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకునేందుకు, అందుకనుగుణంగా యువతను సన్నద్ధం చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సుమారు రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ను ఏర్పాటుచేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.