కరీంనగర్ కలెక్టరేట్(Karimnagar Collectorate)లో నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్(Sanjay Kumar), బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదరడంతో ఇరువురు పరస్పరం తోసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయి సమావేశాన్ని గందరగోళంగా మార్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. అసలు మీరు ఏ పార్టీ అని కౌశిక్ రెడ్డి నిలదీయడంతో గొడవ మొదలైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబు సమక్షంలోనే వాగ్వాదం జరుగడం హాట్ టాపిక్గా మారింది. అనంతరం బయటకు వచ్చి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నిధుల వివరాలు అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 50 శాతం మాత్రమే రుణమాఫీ జరిగిందని అన్నారు. వెంటనే మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 18,500 కుటుంబాలకు దళితబంధు ఇచ్చినట్లు గుర్తుచేశారు. తక్షణమే రెండో విడత దళితబంధు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు బెదిరిస్తే భయపడే వారు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. తాము రైతుల పక్షాన నిలబడతామని అన్నారు.