UPI: చెల్లింపుల్లో రారాజు… యూపీఐ

V. Sai Krishna Reddy
1 Min Read

భారత్‌లో చెల్లింపుల విధానంలో యూపీఐ (UPI) సరికొత్త విప్లవం సృష్టించింది. నగదు లావాదేవీలను వెనక్కి నెట్టి దేశంలో అత్యంత ప్రాధాన్య చెల్లింపుల విధానంగా అవతరించింది. దేశంలోని మొత్తం లావాదేవీల్లో యూపీఐ వాటా 57 శాతానికి చేరగా, నగదు వాటా 38 శాతానికి పరిమితమైందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. సులభమైన వినియోగం, తక్షణమే డబ్బు బదిలీ కావడం వంటి కారణాలతో యూపీఐకి ఆదరణ విపరీతంగా పెరిగింది.

రూపే డెబిట్ కార్డ్, తక్కువ విలువ గల భీమ్-యూపీఐ లావాదేవీల (P2M) ప్రోత్సాహక పథకం యొక్క సామాజిక-ఆర్థిక ప్రభావ విశ్లేషణ” పేరుతో ఈ నివేదికను ఆర్థిక సేవల విభాగం విడుదల చేసింది. ఈ అధ్యయనం ప్రకారం, యూపీఐ వాడేవారిలో 65 శాతం మంది రోజుకు చాలాసార్లు డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా 18-25 ఏళ్ల యువతలో యూపీఐ వినియోగం 66 శాతంగా ఉంది. ఇది డిజిటల్ అలవాట్ల వైపు యువతరం ఎంతగా మొగ్గు చూపుతోందో స్పష్టం చేస్తోంది.

చిన్న వ్యాపారుల్లో కూడా డిజిటల్ చెల్లింపుల స్వీకరణ భారీగా పెరిగింది. దాదాపు 94 శాతం మంది చిన్న వ్యాపారులు యూపీఐని వినియోగిస్తున్నారు. వేగవంతమైన లావాదేవీలు, సులభమైన రికార్డుల నిర్వహణ వల్ల 72 శాతం మంది వ్యాపారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఎన్‌పీసీఐ, బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థల సమన్వయంతో దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ బలోపేతమైంది.

ఈ పథకం అమలు సమయంలో డిజిటల్ లావాదేవీలు దాదాపు 11 రెట్లు పెరిగాయి. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే బ్యాంకుల సంఖ్య 216 నుంచి 661కి పెరగడం విశేషం. ఈ మార్పుల వల్ల ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాలు కూడా తగ్గుముఖం పట్టాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *