భారతీయుల్లో డయాబెటిస్ టెస్టులపై ‘లాన్సెట్’ కీలక హెచ్చరిక

V. Sai Krishna Reddy
1 Min Read

భారతదేశం సహా దక్షిణాసియా దేశాల్లో మధుమేహం (డయాబెటిస్) నిర్ధారణ, పర్యవేక్షణ కోసం కేవలం హెచ్‌బీఏ1సీ పరీక్షపైనే పూర్తిగా ఆధారపడటం సరైంది కాదని ప్రముఖ భారతీయ వైద్య నిపుణులు హెచ్చరించారు. భారతీయుల్లో అధికంగా కనిపించే రక్తహీనత (అనీమియా) వంటి సమస్యల కారణంగా ఈ టెస్టు ఫలితాలు తప్పుగా వచ్చే ప్రమాదం ఉందని వారు స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్ – సౌత్ ఈస్ట్ ఆసియా’ జర్నల్‌లో ఒక అధ్యయనం ప్రచురితమైంది.

ఢిల్లీలోని ఫోర్టిస్-సీడీఓసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఛైర్మన్, ప్రొఫెసర్ అనూప్ మిశ్రా నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. భారతీయులలో ఐరన్ లోపంతో కూడిన రక్తహీనత, థలసేమియా, జీ6పీడీ లోపం వంటి హిమోగ్లోబిన్‌కు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితులు హెచ్‌బీఏ1సీ రీడింగులను ప్రభావితం చేస్తాయని, ఫలితంగా కొందరిలో షుగర్ వ్యాధి ఉన్నా గుర్తించకపోవడం లేదా లేకపోయినా ఉన్నట్టు తప్పుడు నిర్ధారణకు గురయ్యే అవకాశం ఉందని అధ్యయనంలో వివరించారు.

కేవలం హెచ్‌బీఏ1సీపై ఆధారపడితే వ్యాధి నిర్ధారణ, పర్యవేక్షణలో పొరపాట్లు జరగవచ్చు. దీనివల్ల కొందరిలో వ్యాధిని ఆలస్యంగా గుర్తించే ప్రమాదం ఉంది” అని ప్రొఫెసర్ అనూప్ మిశ్రా తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు, హెచ్‌బీఏ1సీతో పాటు ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్ (OGTT), సెల్ఫ్-మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ (SMBG), కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ (CGM) వంటి బహుళ పరీక్షల విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచించారు. ముఖ్యంగా వనరులు పరిమితంగా ఉండే గ్రామీణ ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కచ్చితమైన రోగ నిర్ధారణకు ఈ సమగ్ర విధానం ఎంతో అవసరమని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *