ఇది మీ అజ్ఞానమా? లేక సీఎం రేవంత్ తో మీకు, బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందమా..?: కిషన్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

V. Sai Krishna Reddy
1 Min Read

సింగరేణి బొగ్గు గనుల టెండర్ల కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ స్కామ్‌పై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వైఖరిని తప్పుబడుతూ, సీఎం రేవంత్ రెడ్డితో బీజేపీకి చీకటి ఒప్పందం ఉందేమోనని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిదికి అక్రమంగా టెండర్ కట్టబెట్టేందుకే దేశంలో ఎక్కడా లేని ‘సైట్ విజిట్’ నిబంధనను కొత్తగా చేర్చారని కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో మైనస్ 20 శాతానికి ఖరారైన టెండర్లను రద్దు చేసి, ఇప్పుడు దాదాపు 10 శాతం ప్లస్‌కు కాంట్రాక్టులు అప్పగించడం దారుణమని విమర్శించారు. ఈ కుంభకోణంలో ప్రధాన దోషే ముందుకొచ్చి సీబీఐ విచారణ కోరాలని కేంద్రమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. “పట్టపగలు దోపిడీ చేసిన దొంగే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి విచారణ జరపమని కోరతాడా?” అని నిలదీశారు.

సింగరేణిలో 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ అవినీతి జరుగుతున్నా ప్రేక్షకపాత్ర వహించడంపై కేటీఆర్ మండిపడ్డారు. ఇది కిషన్ రెడ్డి అజ్ఞానమా లేక కాంగ్రెస్‌తో కుమ్మక్కా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని నష్టాల్లోకి నెట్టి, ఆ తర్వాత సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

ఈ స్కామ్‌పై విచారణ జరపాలని సింగరేణి కార్మికులు ‘జంగ్ సైరన్’ మోగించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక అని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణిని కాంగ్రెస్, బీజేపీల నుంచి కాపాడే వరకు కార్మికులతో కలిసి తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *