నర్సాపూర్(ప్రజాజ్యోతి) ప్రేమించాడనే నెపంతో ఓ యువకుడిని కారులో తీసుకెళ్లి, అటవీ ప్రాంతంలో బట్టలు విప్పి దారుణంగా కొట్టిన సంఘటన నర్సాపూర్ మండలంలో వెలుగుచూసింది. బాధితుని తండ్రి విఠల్ తెలిపిన వివరాల ప్రకారం.. హత్నూర మండలం లక్ష్మ్యా తండాకు చెందిన దేవనోత్ దేవిసింగ్ (24), బ్యాతోల్ చెందిన ఓ యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
• దాడిచేసి.. చనిపోయాడని భావించి.
ఈ నెల 20న చర్చల పేరుతో దేవిసింగ్ను నర్సాపూర్ బస్టాండ్కు పిలిపించిన యువతి బంధువులు (వెంకటేష్, నరేష్, కార్తీక్, తరుణ్), అతడిని బలవంతంగా కారులో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బట్టలు విప్పి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దేవిసింగ్ స్పృహ కోల్పోవడంతో చనిపోయాడని భావించి వారు పరారయ్యారు. స్థానికుల సాయంతో బాధితుడు సూరారంలోని మల్లా రెడ్డి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. తన కుమారుడిని చంపడానికి ప్రయత్నించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని తండ్రి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
