ఐసీసీ టీ20 వరల్డ్ కప్… రూ.100 కే టికెట్… ఈ సాయంత్రం నుంచే అమ్మకాలు

V. Sai Krishna Reddy
2 Min Read

క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుభవార్త చెప్పింది. 2026లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలను ఈరోజు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం, ఈ రోజు (డిసెంబరు 11) సాయంత్రం 6:45 గంటల నుంచి https://tickets.cricketworldcup.com/ వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. భారత్‌లో కొన్ని వేదికల్లో టికెట్ ధరలు కేవలం రూ.100 నుంచి ప్రారంభం కానుండటం విశేషం.

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ పదో ఎడిషన్ మెగా టోర్నీ, 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 55 మ్యాచ్‌లు ఉంటాయి. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతో పాటు శ్రీలంకలోని కొలంబో (రెండు వేదికలు), క్యాండీ నగరాలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఈ మెగా ఈవెంట్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో టికెట్ ధరలను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ ధరకే ఇస్తున్నట్టు ఐసీసీ తెలిపింది. భారత్‌లో రూ.100, శ్రీలంకలో 1000 శ్రీలంకన్ రూపాయల నుంచి టికెట్ల ధరలు ప్రారంభం అవుతాయి. ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ, “ప్రతి అభిమాని, వారి నేపథ్యం, ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ప్రపంచ స్థాయి క్రికెట్‌ను స్టేడియంలో ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించాలన్నదే మా లక్ష్యం. ఈ టోర్నీ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకంగా నిలిచిపోతుంది” అని వివరించారు.

ఈ విషయంపై బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ, “టికెట్ ధరలు కేవలం రూ.100 నుంచి ప్రారంభం కావడం ఈ టోర్నీపై మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు అత్యుత్తమ అనుభూతిని అందించేందుకు కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు. శ్రీలంక క్రికెట్ సీఈఓ ఆష్లే డి సిల్వా స్పందిస్తూ, “భారత్‌తో కలిసి ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉంది. అభిమానులందరూ ముందే టికెట్లు కొనుగోలు చేసి, ఈ క్రికెట్ సంబరంలో భాగం కావాలి” అని కోరారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *