రాజకీయ ఉచ్చులో పడొద్దు.. ఓయూ విద్యార్థులకు సీఎం రేవంత్ హితవు

V. Sai Krishna Reddy
1 Min Read

ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) సమగ్రాభివృద్ధికి రూ.1000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిన్న ఆయన ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుట జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వర్సిటీ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్‌ప్లాన్, డిజైన్లను, విద్యార్థుల సూచనల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. సమస్యలపై పోరాడే స్వేచ్ఛ విద్యార్థులకు ఎప్పుడూ ఉంటుందని, అయితే రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. “కష్టపడి చదువుకొని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఎదగడంతో పాటు, నాయకులై రాష్ట్రాన్ని పాలించాలి” అని ఆయన ఆకాంక్షించారు. తనది ధైర్యం కాదని, ఓయూ విద్యార్థులపై ఉన్న అభిమానంతోనే ఇక్కడికి వచ్చానని తెలిపారు.

గత పదేళ్ల పాలనలో యూనివర్సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ బిడ్డలు ఫామ్‌హౌస్‌లు అడగలేదని, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే కోరారని అన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని, పేదవాడి మనసు చదవడం తనకు తెలుసని వ్యాఖ్యానించారు. రెండేళ్లలో ఓయూకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అయితే, సీఎం ప్రసంగంలో ఉద్యోగ ప్రకటనలపై స్పష్టత లేకపోవడంతో కొందరు విద్యార్థులు నిరసనకు దిగారు. సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను అడ్డుకుని విద్యార్థులు నిలదీశారు. ఇదిలా ఉండగా, ఓయూ పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీకి పయనమయ్యారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *