ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్లు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది.
ప్రైవేటు కళాశాలలకు ఫీజు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తక్షణమే రూ. 600 కోట్ల విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మరో రూ. 300 కోట్లు త్వరలో చెల్లించడానికి హామీ ఇచ్చారు. గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలు ఈ నెల 3వ తేదీ నుంచి బంద్ కారణంగా మూతబడ్డాయి. ప్రభుత్వంతో కళాశాల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో కళాశాలలు రేపటి నుంచి తెరుచుకోనున్నాయి.
