కుమారుడి రిసెప్షన్ కోసం ఉంచిన రెండు కోట్లను… రైతు సంక్షేమం కోసం సీఎంకు అందజేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్
మిర్యాలగూడ, సెప్టెంబర్ 18,( ప్రజాజ్యోతి ): కుమారుడి రిసెప్షన్ అంగరంగ వైభవంగా చేయాలని… దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రిని ముఖ్యఅతిథిగా తీసుకురావాలని తలంచిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) తన కుటుంబ సభ్యుల మహోన్నతమైన ఆలోచనలతో రిసెప్షన్ రద్దు చేసుకొని ఖర్చు చేయాలనుకున్నా 2 కోట్ల రూపాయలను మిర్యాలగూడ రైతుల సంక్షేమం కోసం వినియోగించాలంటూ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు. విస్తృతమైన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజా ఆదరణ పొంది గెలుపొందిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ తన సేవా కార్యక్రమాలను మాత్రం మరువలేదు. ప్రస్తుతం రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారి ఇబ్బందులను తొలగించేందుకు నియోజకవర్గంలోని ప్రతి రైతుకు ఒక యూరియా వస్తా ఉచితంగా అందజేసేందుకు సంకల్పించారు. ఎమ్మెల్యే ఆలోచన విధానాలను పునికిపుచ్చుకున్న కుమారుడు సాయి ప్రసన్న, కోడలు వెన్నెల లు తమ రిసెప్షన్ ఆడంబరంగా వద్దంటూ, రైతు సంక్షేమం కోసం వినియోగించాలంటూ తెలియజేయడంతో కుటుంబ సభ్యులంతా వారి గొప్ప ఆలోచనకు మద్దతుగా నిలిచారు. రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న రెండు కోట్ల రూపాయలను గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు ఎమ్మెల్యే బిఎల్ఆర్. ఆ డబ్బును రైతు సంక్షేమం కోసం ఖర్చు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ కుటుంబ సభ్యుల ఔదార్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, బి ఎల్ అర్ సతీమణి మాధవి, కుమారుడు బత్తుల సాయి ఈశ్వర్ రెడ్డి లు ఉన్నారు.
