తెలంగాణలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీలు) జారీ చేస్తే, ఏపీ ప్రాజెక్టులపై తాము కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని ఆయన స్పష్టం చేశారు.
“ఈరోజు అందుకే నేను పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచన చేస్తున్నాను. కేంద్రంలో మీకు పలుకుబడి ఉండవచ్చు.. మీరేం చెబితే మోదీ గారు అది వినవచ్చు. అలా అని ప్రాజెక్టులన్నింటికీ అనుమతి వస్తుందని అనుకుంటే అది భ్రమ. అలాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన మా వద్ద ఉంది. మేము వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నాం. అక్కడ మాకు న్యాయం జరగకుంటే న్యాయస్థానాలకు వెళతాం.. అక్కడి నుంచి ప్రజల వద్దకు వెళతాం” అని ఆయన అన్నారు.
బుధవారం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశంపై అఖిలపక్ష ఎంపీలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.
గోదావరి-బనకచర్లపై గత ప్రభుత్వాల ఒప్పందం
2019 అక్టోబరులోనే అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించే విషయంపై చర్చించారని రేవంత్ రెడ్డి అన్నారు. “గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు ఆనాడే ఒకరకంగా అంకురార్పణ జరిగింది. రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తామని కేసీఆర్ అన్నట్లు నాడు ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో కథనాలు కూడా వచ్చాయి” అని ఆయన తెలిపారు. బనకచర్ల వ్యవహారంపై ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు చెప్పారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదులే జీవనాధారమని, ఈ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని ఆయన పునరుద్ఘాటించారు.
కేసీఆర్ నిర్ణయాలపై రేవంత్ విమర్శలు
2016 సెప్టెంబర్ 21న కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ఏటా 3 వేల టీఎంసీల గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి పోతోందని అన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. “ఈ విషయంపై మొదట మాట్లాడిందే కేసీఆర్. అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఎవరు ఏం మాట్లాడారో రికార్డుల్లో స్పష్టంగా ఉంది. తెలంగాణకు కృష్ణా నది జలాల్లో 299 టీఎంసీలు సరిపోతాయని కూడా ఆనాడే కేసీఆర్ అంగీకరించి సంతకం చేశారు. ఆ సంతకమే ఇప్పుడు తెలంగాణకు గుదిబండగా మారింది” అని ఆయన విమర్శించారు. తెలంగాణకు 968 టీఎంసీల నీటిని వాడుకునేలా ప్రాజెక్టులకు ఏపీ ఎన్ఓసీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్ కార్యాచరణ
గోదావరి-బనకచర్ల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు నిపుణులైన న్యాయవాదులను నియమించుకుంటామని చెప్పారు. ఈ విషయంలో అన్ని పార్టీలను కలుపుకొని పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
సీఎం వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ ఎంపీ
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆనాడు తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే కేసీఆర్ మాట్లాడారని ఆయన వివరణ ఇచ్చారు. కృష్ణా నదిని కలుపుతూ గోదావరి జలాలు తీసుకెళ్తే తమకు అభ్యంతరం లేదని మాత్రమే కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ఈ సమావేశం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో జరుగుతోందని ఆరోపించారు.