సకాలంలో స్పందించిన ఖాకీలు … నిండు ప్రాణం నిలిపారు..!
ఆత్మహత్య కు ప్రయత్నించిన యువతని కాపాడిన పోలీసులు
మిర్యాలగూడ, జూన్ 07,( ప్రజాజ్యోతి ): కుటుంబ కలహాలతో విరక్తి చెందిన ఓ యువతి.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు సన్నద్ధమయ్యింది… గమనించిన గుర్తుతెలియని వ్యక్తి 100 కాల్ కు సమాచారం అందించారు… వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని… మరు క్షణం లో రైలు కింద పడబోయిన యువతిని కాపాడి నిండు ప్రాణాలు నిలిపారు… పోలీసులు స్పందించిన తీరుకు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు… ఈ సంఘటన బక్రీద్ పర్వదినం శనివారం నాడు మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వెలుగు చూసింది. పట్టణంలోని చైతన్య నగర్ కు చెందిన రమావత్ శ్రీలత టైలర్ గా పనిచేస్తుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకొని పట్టాలెక్కింది. గమనించిన కొందరు అత్యవసరంగా 100 కాల్ కు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన టూ టౌన్ స్టేషన్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ జి.నాగరాజు, కానిస్టేబుల్ ధనంజయ హుటాహుటిన ట్రాక్ వద్దకు చేరుకొని ఆమెను పక్కకు తీసుకువచ్చారు. అదే సమయంలో జన్మభూమి ఎక్స్ప్రెస్ రావడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పినట్లు అయింది. ఆత్మహత్య ప్రయత్నం చేయటం తప్పని సదరు యువతకి కౌన్సిలింగ్ ఇచ్చి, వారి బంధువులను పిలిపించి అప్పగించారు. సకాలంలో స్పందించి నిండు ప్రాణం నిలిపిన పోలీసుల తీరును పట్టణ ప్రజలు హర్షిస్తూ అభినందనలు తెలిపారు.