సత్తా చాటిన కేఎల్ రాహుల్.. ఇంగ్లాండ్ లయన్స్‌తో మ్యాచ్‌లో క్లాస్ సెంచరీ!

V. Sai Krishna Reddy
2 Min Read

ఇంగ్లాండ్‌తో కీలకమైన ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌ను అందుకున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ తరఫున ఆడుతున్న రాహుల్, నిన్న‌ తొలి రోజు ఆటలో అద్భుతమైన శతకంతో కదం తొక్కాడు. వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో రాహుల్ తన క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.

అనుభవజ్ఞుడైన పేసర్ క్రిస్ వోక్స్ వంటి నాణ్యమైన బౌలర్లు ఉన్న ఇంగ్లాండ్ లయన్స్ బౌలింగ్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ 168 బంతుల్లో 116 పరుగులు సాధించాడు. ఇది ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతనికి 19వ శతకం కావడం విశేషం. ఈ సెంచరీ ద్వారా రాహుల్‌కు ఆత్మవిశ్వాసం పెర‌గ‌డంతో పాటు రాబోయే టెస్ట్ సిరీస్‌కు అవసరమైన కీలకమైన మ్యాచ్ ప్రాక్టీస్ కూడా దొరికింది.

ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రాహుల్, ఆరంభంలో కొంత నిదానంగా ఆడినా, క్రిస్ వోక్స్ వంటి బౌలర్ల నుంచి ఎదురైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 102 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత, రాహుల్ తన బ్యాటింగ్ వేగాన్ని పెంచాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ నుంచి రెడ్-బాల్ క్రికెట్‌కు అలవాటు పడడంలో ఎలాంటి ఇబ్బంది పడలేదని అతని బ్యాటింగ్ శైలి స్పష్టం చేసింది. ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులకు తాను సిద్ధంగా ఉన్నానని ఈ ఇన్నింగ్స్ ద్వారా రాహుల్ సంకేతాలిచ్చాడు.

రాహుల్‌కు తోడుగా వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్ కూడా అద్భుతంగా రాణించాడు. కేవలం 87 బంతుల్లో 52 పరుగులు చేసిన జురెల్, వరుసగా మూడో అర్ధశతకాన్ని నమోదు చేసి తన ఫామ్‌ను కొనసాగించాడు. వీరిద్దరి భాగస్వామ్యం భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్‌ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి, భారత్ ‘ఎ’ జట్టు 83 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. క్రీజులో తనుష్ కోటియన్ (5), అన్షుల్ కంబోజ్ (1) ఉన్నారు. ఇంగ్లాండ్ ల‌య‌న్స్ బౌల‌ర్ల‌లో వోక్స్ 3 వికెట్లు తీయ‌గా… జార్జ్ హిల్ 2, ఫ‌హాద్ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *