కాళేశ్వరంపై కేసీఆర్కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు
విచారణకు కేసీఆర్ హాజరుకావాలన్న మంత్రి శ్రీధర్ బాబు
తప్పు చేయకుంటే భయమెందుకని కేసీఆర్ను ప్రశ్నించిన మంత్రి
చట్టం ముందు అందరూ సమానమేనని వ్యాఖ్య
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ అంశంపై తెలంగాణ మంత్రి డి. శ్రీధర్ బాబు స్పందిస్తూ, కేసీఆర్ విచారణకు హాజరుకావాలని, చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు.
పెద్దపల్లిలో మంగళవారం నాడు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, “నోటీసులు ఇప్పుడే జారీ అయ్యాయి కదా.. ఆయన (కేసీఆర్) విచారణకు హాజరవుతారనే భావిస్తున్నాను. ఒకవేళ తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది?” అని బీఆర్ఎస్ అధినేతను సూటిగా ప్రశ్నించారు.
ఈ సందర్భంగా, కాళేశ్వరం విషయంలో గతంలో తనపై కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని, ఆ కేసులను ఎనిమిదేళ్ల పాటు ఎదుర్కొన్నానని మంత్రి గుర్తు చేసుకున్నారు. తన తప్పేమీ లేదని చివరికి కోర్టు ఆ కేసును కొట్టివేసిందని ఆయన వివరించారు.