భారత్ తో కయ్యానికి కాలుదువ్విన పాకిస్థాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓవైపు భారత సైన్యం చేస్తున్న ప్రతీకార దాడులను తట్టుకోలేకపోతున్న పాక్ కు తాజాగా ఇంధన సంక్షోభం ముప్పు భయపెడుతోంది. దేశంలో ఇంధన కొరత ఏర్పడే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్లోని పెట్రోల్ బంక్ లను రెండు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి శుక్రవారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. శని, ఆదివారాలు బంక్ లు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో ఇంధన నిల్వలు పెంచుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కుదేలవగా భారత్ తో యుద్ధ వాతావరణం మరింత అల్లాడిపోయేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిత్యావసరాల కొనుగోలుకు కూడా పాక్ ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు ఉండవని అంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) ముందు మరోసారి సాయం కోసం అర్థించింది. ఒక బిలియన్ డాలర్ల సాయాన్ని అందించేందుకు ఐఎంఎఫ్ అంగీకరించిందని పాక్ ప్రధాని కార్యాలయం తెలిపింది