పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ క్షిపణి దాడులకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందంటూ చైనా ప్రభుత్వ మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాత విమాన ప్రమాదాల చిత్రాలను ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని మండిపడింది.
ఈ విషయమై చైనాలోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ, “ప్రియమైన గ్లోబల్ టైమ్స్, దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే ముందు వాస్తవాలను ధ్రువీకరించుకోండి. మీ వార్తా మూలాలను క్షుణ్ణంగా పరిశీలించుకోండి” అని హితవు పలికింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్కు అనుకూలంగా కొన్ని ఖాతాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని, వాటిని మీడియా సంస్థలు గుడ్డిగా ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం, పాత్రికేయ నైతిక విలువల ఉల్లంఘన అని పేర్కొంది. ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకర్ ‘పీఐబీ ఫ్యాక్ట్ చెక్’ కూడా పాత విమాన ప్రమాదాల చిత్రాలతో జరుగుతున్న దుష్ప్రచారాన్ని బహిర్గతం చేసిందని గుర్తు చేసింది.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్లు భారత్ స్పష్టం చేసింది. ఈ దాడిలో మత ప్రాతిపదికన గుర్తించి 26 మందిని, వారి కుటుంబ సభ్యుల ముందే అత్యంత దారుణంగా తలపై కాల్చి చంపారని తెలిపింది. దీనికి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) అనే సంస్థ బాధ్యత వహించిందని, ఇది ఐక్యరాజ్యసమితి నిషేధించిన లష్కరే తోయిబాకు చెందిన ముసుగు సంస్థ అని భారత రాయబార కార్యాలయం వివరించింది.
పహల్గామ్ దాడి జరిగి రెండు వారాలు గడుస్తున్నా పాకిస్థాన్ తన భూభాగంలోని ఉగ్రవాద నెట్వర్క్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పైగా ఆరోపణలను ఖండిస్తూ కాలయాపన చేస్తోందని భారత్ ఆరోపించింది. మరిన్ని దాడులకు ప్రణాళికలు జరుగుతున్నట్లు తమ నిఘా వర్గాలు హెచ్చరించాయని తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతిస్పందించే హక్కు భారత్కు ఉందని, విజయవంతమైన క్షిపణి దాడులు నిర్వహించిన సాయుధ బలగాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారని పేర్కొంది. ముజఫరాబాద్, కోట్లి, రావల్ కోట్ సహా తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై ఈ దాడులు జరిగాయి.