ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై త్రివిధ దళాలు చేసిన దాడులకు సంబంధించి పాకిస్థాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్స్ను ప్రభుత్వం షేర్ చేసింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించింది. ఆ వీడియోలో అర్ధరాత్రి వేళ రద్దీ రోడ్డుపై జనాలు, బైకులపై వెళ్తున్నవారు పెద్ద ఎత్తున గుమికూడారు. వారికి కొంత దూరంలో బాంబు పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం కనిపించింది. పొగ కూడా దట్టంగా కమ్ముకుంది.
కొన్ని క్షణాల తర్వాత భారత క్షిపణి దాడిచేసినట్టుగా ఒక విజిల్ సౌండ్, భారీ విస్పోటనం కనిపించింది. ఇది బహుశా దీర్ఘశ్రేణి ఎస్సీఏఎల్పీ క్షిపణి అయి ఉంటుంది. బాంబు పేలుడు దాటికి వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి తగ్గడం వీడియోలో కనిపించింది. ఒక పెద్ద, ప్రకాశవంతమైన నారింజ రంగు ఫైర్బాల్ (మంటలు) ఆ ప్రాంతంలో కనిపించింది. ప్రజలు అరబిక్లో ప్రార్థనలు చేయడం, భయాందోళనలతో అరవడం ఆ వీడియోలో వినిపించింది.
మరో వీడియో కారు డ్యాష్బోర్డులోని కెమెరా రికార్డు చేసింది. దీని ప్రకారం అది పోలీస్ చెక్పోస్టును దాటుతోంది. ఆ కారు డ్రైవర్ ప్రయాణికుడితో మాట్లాడుతూ ‘బాంబు’ అని అనడం ఆ వీడియోలో వినిపించింది. దూరంగా రెండోసారి మరో భారీ పేలుడు, నారింజ రంగులో మంటలు చెలరేగడం కనిపించింది.
‘ఆపరేషన్ సిందూర్’లో భారత్ ఉపయోగించిన ఆయుధాలు ఇవే
పాక్ ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడుల్లో భారత్ అనేక రకాల బాంబులను ఉపయోగించింది. ఇందులో బంకర్లను ఛేదించే, గాలిలో ప్రయోగించే ఎస్సీఏల్పీ దీర్ఘశ్రేణి క్షిపణి కూడా ఉంది. ఇది ఒక స్టాండ్ ఆఫ్ స్మార్ట్బాంబు. అలాగే, ‘లోటరింగ్ మందుగుండు సామగ్రి’ లేదా డ్రోన్-బోర్న్ క్షిపణులు కూడా ఉపయోగించారు. భారత దాడుల తర్వాత పాకిస్థాన్ ఆర్మీ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏకపక్షంగా, విచక్షణరహితంగా కాల్పులకు దిగింది.