యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
ట్రయల్ రన్ సమయంలో
యూనిట్-1బాయిలర్ వద్ద ఆయిల్ లీకు తో ప్రమాదం
మిర్యాలగూడ, ఏప్రిల్ 28,( ప్రజాజ్యోతి ) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్టులోని యూనిట్ -1లో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. బాయిలర్ నుండి ఆయిల్ లీకేజీ అయ్యి మంటలు చెలరేగటంతో యూనిట్ వన్ పాక్షికంగా దెబ్బతిన్నది. వచ్చే నెలలో యూనిట్ వన్ ను ప్రారంభించనుండగా అందుకుగాను అధికారులు ముందస్తు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ ప్రక్రియలో సోమవారం తెల్లవారుజామున ఆయిల్ లీక్ కావటంతో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వెంటనే ఫైర్ ఇంజన్లు పిలిపించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇతర విభాగాలలో ఉన్న సిబ్బంది కూడా సహకారం అందించడంతో పెద్దగా ఆస్తి నష్టం,ప్రాణ నష్టం జరగకుండానే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఈ ప్రమాదం ఫై పూర్తిగా ధ్రువీకరించని జెన్కో అధికారులు. ట్రయల్ రన్ చేసే సమయంలో ఇలాంటి ప్రమాదాలు సహజమే అని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయని సమాచారం . ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన ప్రమాదం ద్వారా లోపాలను గుర్తించి, వాటిని వీలైనంత తొందరలో సరిచేసి తిరిగి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికార వర్గాల సమాచారం.