రెవెన్యూ సిబ్బంది భూ భారతి చట్టాన్ని క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో అమలు చేయాలి : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి
-భూ భారతి చట్టంపై భూములకు సంబంధించిన గెట్ల పంచాయతీలు,ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి…
-ధరణి సమస్యల పరిష్కారానికి రైతులు కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయారు..
నిడమనూరు,ఏప్రిల్ 27(ప్రజాజ్యోతి)ఃభూ భారతి చట్టాన్ని రెవెన్యూ సిబ్బంది.. క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో అమలు చేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు.భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం నిడమనూరు ,త్రిపురారం మండల కేంద్రాలల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న ధరణి పోర్టల్ వల్ల అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగడమే కాకుండా, గ్రామస్థులు మధ్య భూములకు సంబంధించిన గెట్ల పంచాయతీలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. ఎలాంటి నియమ నిబంధన లేకుండా ధరణి అవినీతి అక్రమాలకు అవకాశం ఇచ్చిందన్నారు.భూ సమస్యల పరిష్కారానికి రైతులు కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయారని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ధరణిని నిలిపివేసి కొత్త చట్టం తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఏడాదిన్నర కాలంలో మేధావులు, అడ్వకేట్లు, ప్రజాప్రతినిధులు అందరితో సమాలోచనచేసి, చర్చించి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. భూ భారతి చట్టంలో ఎన్నో సవరణలు చేసి చివరికి చట్టాన్ని తేవడం జరిగిందని, భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ సవరణలు చేస్తామని తెలిపారు. ధరణిలో ఎదుర్కొన్న సమస్యలన్నింటిని పరిష్కరించే భూ భారతి వంటి మంచి చట్టం పై ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తాము ఈ అవగాహన సదస్సులలో పాల్గొంటామన్నారు.అంతకుముందు భూభారతి అవగాహన సదస్సు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు… ర్యాలీలు నిర్వహించడం సరి కాదని కార్యకర్తలకు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి సూచించడంతో పాటు… సమావేశం ఆలస్యంగా హజరైనందకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మన్నించమని కోరాడు.అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది భూ భారతి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, పారదర్శకంగా పనిచేయాలని ,ప్రతి గ్రామానికి వెళ్లి చట్టం పట్ల రైతులకు అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూ భారతి చట్టం అవగాహనలో భాగంగా ఇప్పటివరకు 30 మండలాల్లో అవగాహన కార్యక్రమాలను పూర్తి చేశామని పేర్కొన్నారు.త్వరలోనే ప్రతి గ్రామానికి గ్రామ పాలన అధికారి వస్తారని వారు అవినీతికి పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత తహశీల్దార్ పై ఉందన్నారు. అలాగే నిడమనూరు మండలంలో సర్వేయర్ల కొరత ఉందని ,దీనిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భూ భారతి చట్టం లోని సెక్షన్ 8,13,16 విభాగాల ప్రకారం లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్, ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, తహశీల్దార్ కృష్ణయ్య, ఎంపిడిఓ భువనగిరి రమేష్,మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం,నిడమానూరు పిఏసిఎస్ చైర్మన్ విరిగినేని అంజయ్య,మేరెడ్డి వెంకట్ రాహుల్,మేరెడ్డి వెంకట్ రెడ్డి,యడవెల్లి వల్లభ్ రెడ్డి, యడవెల్లి విజయ్ కుమార్,నందికొండ మట్టారెడ్డి, కొండా శ్రీనివాస్ రెడ్డి,ముంగిశివమారయ్య, ఉన్నం చిన్నవీరయ్య, సత్యనారాయణ, అంకతి వెంకటరమణ,నర్సింగ్ విజయ్, మెరుగు శ్రీనివాస్, గడ్డం గోవిందరెడ్డి,చెరక శ్రీను,మోసాల శ్రీను,మండల అధికారులు, ప్రజాప్రతినిధులు , అవగాహన సదస్సుకు,తదితరులు,హాజరైయ్యారు.