సివిల్స్ లో మెరిసిన వరంగల్ కు చెందిన ‘సాయి శివాని’
* యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్ కు చెందిన సాయిశివాని కి 11వ ర్యాంక్
యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్ కు చెందిన ఇట్టబోయిన సాయిశివాని జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ తో సత్తా చాటింది. వరంగల్ నగరంలోని ఇట్టబోయిన రాజ్ కుమార్ – రజితల ప్రథమ పుత్రిక ఇట్టబోయిన సాయిశివాని జాతీయస్థాయిలో టాప్ 11 వ ర్యాంకు సాధించి గర్వకారణంగా నిలిచింది. జాతీయ స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల శ్రమకు తగిన ఫలితం దక్కిందని, తమ కూతురు కలెక్టర్ కాబోతుందంటూ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
యూపీఎస్సీ-2024 సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 1056 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర పోస్టుల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29వ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్ లో ర్యాంకుల ఆధారంగా వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు దశల వారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు చేశారు. ఇవాళ తుది ఫలితాలను ప్రకటించారు. మొత్తం 1,009 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 109 మంది, ఓబీసీ నుంచి 318 మంది, ఎస్సీ కేటగిరీలో 160 మంది, ఎస్టీ కేటగిరీ నుంచి 87 మంది చొప్పున ఉన్నారు.