ప్రజల చెంతకు ప్రభుత్వం భూ భారతి తో సమస్యలకు పరిష్కారం పైలట్ ప్రాజెక్ట్ గా మండలానికి ఒక గ్రామం ఎంపిక భూమికి భద్రత కల్పించనున్న భూ భారతి

Nalgonda Bureau
4 Min Read

ప్రజల చెంతకు ప్రభుత్వం

భూ భారతి తో సమస్యలకు పరిష్కారం

పైలట్ ప్రాజెక్ట్ గా మండలానికి ఒక గ్రామం ఎంపిక

భూమికి భద్రత కల్పించనున్న భూ భారతి

ఎన్నో ఏళ్లుగా లక్షలల్లో పేరుకు పోయిన భూ సమస్యలకు పరిష్కారం లభించనున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

 

 

వలిగొండ ఏప్రిల్ 22 (ప్రజాజ్యోతి న్యూస్):వలిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ భారతి(ఆర్ ఓ ఆర్)చట్టం పై అవగాహన కొరకు సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం లు పాల్గొన్నారు. ముఖ్య అతిధి గా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సదస్సు లో పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వర్గస్థులైన రోమన్ క్యాథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కు నివాళులు అర్పించారు. తదనంతరం భూ భారతి కరపత్రాలను ఆవిష్కరించారు. సభ ప్రారంభానికి ముందుగా భూ భారతి (ఆర్ ఓ ఆర్ )చట్టం పై జిల్లా కలెక్టర్ హనుమంతరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటు చేసి చట్టం లోని ప్రతి ఒక్క అంశాన్ని సమగ్రంగా వివరించారు.రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూ భారతి చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచేందుకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మినహాయించగా మిగిలిన 32 జిల్లాలలో 4జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసామని, ఆయా జిల్లాలలో జిల్లాకు ఒక మండలము ఎంపిక చేసి భూ భారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్) చట్టం అమలు చేస్తున్నామన్నారు. 2025, మే 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 28 జిల్లాలోనూ జిల్లాకు ఒక మండలము ఎంపిక చేసి భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు పరుస్తామన్నారు. గతంలో సాదా బైనామా ధరణిలో అవకాశం లేకపోవడంతో కోర్ట్ కూడా ఏమీ చేయలేకపోయిందని అన్నారు. ధరణి క్రింద స్వీకరించిన పరిష్కారం కాని 9.26 లక్షల దరఖాస్తులను భూభారతి లో పరిష్కరిస్తామన్నారు. కబ్జా కు గురైన ప్రభుత్వ రెవెన్యూ, ఫారెస్ట్, భూదాన్,వక్ఫ్, దేవాదాయ భూములపై పోర్టల్ ద్వారా ఫిర్యాదులు అందించవచ్చునని, ఆక్రమించిన వారు ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదలకు 10లక్షల వరకు వైద్య సదుపాయాలు, 200 వాట్స్ ఉచిత విద్యుత్, 500 రూలకే వంటగ్యాస్ సిలిండర్, ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం తో పాటు 6వేల కోట్లు వెచ్చించి ధనికులతో సమానంగా నిరుపేదలు కూడా సన్నబియ్యం తో కడుపునిండా భోజనం చేయాలని గొప్ప ఉద్దేశ్యం తో సన్నాలు పండించిన రైతులకు బోనస్ గా 500 రూ.లు బోనస్ ఇవ్వడం జరిగిందన్నారు. రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.శిథిలావస్థకు చేరుకున్న తహశీల్దార్ కార్యాలయాల నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కోరిక మేరకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానన్నారు.జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ధరణిలో అప్పీల్ వ్యవస్థ లేదని, నేరుగా కోర్ట్ కు మాత్రమే వెళ్ళవలసి వచ్చేదన్నారు.
భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థ ఉండడం ద్వారా సమస్యలు పరిష్కార మవుతాయని, చట్టం అమలు పరిచేందుకు తహసీల్దార్ లు రెవెన్యూ సిబ్బందితో గ్రామాలకు వస్తారని, దరఖాస్తు స్వీకరించడమే కాకుండా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తారని, లేని పక్షంలో ఆర్డీఓ కు అప్పీల్ చేసుకోవచ్చునని, అప్పటికీ పరిష్కారం కాకపోతే కలెక్టర్ ను కలవాల్సి ఉంటుందన్నారు. సమస్య జటిలం అయితే ఆపై ట్రిబ్యునల్ పరిష్కరిస్తుందన్నారు. ఇకపై భూముల సర్వే నెంబర్లు నమోదు చేయడమే కాకుండా, సర్వేయర్ తో హద్దులు ఏర్పాటు చేయించి మ్యాపులతో సహా భూ రికార్డులలో నమోదు చేస్తూ, కంప్యూటరీకరణ చేస్తామని,
భూ భద్రత కై ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో సంబంధిత భూ రికార్డులను భద్రపరుస్తామన్నారు. భూ సమస్యలు ఇకపై ఉండవన్నారు. అనంతరం మంత్రికి శాలువా లను కప్పి చిత్రపటాలను అందించి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ)వీరారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆవేజ్ చిస్తీ, భువనగిరి మార్కెట్ చైర్మన్ రేఖ బాబురావు, వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా నాయక్, ఆర్డీఓ లు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *