కమ్యూనిస్టులు అంటేనే.. బీజేపీకి వ్యతిరేకం. మత తత్వ పార్టీ అని.. ప్రజలను మోసం చేస్తుందని.. బీజేపీపై కమ్యూనిస్టులు నిప్పులు చెరుగుతుంటారు. ఇటీవల కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చింది(ప్రస్తుతం చట్టంగా మారింది). ఆ సమయంలో సీపీఎం, సీపీఐ తదితర వామపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. పైగా పెద్ద ఎత్తున ముస్లింలకు అండగా ఉంటామని కూడా ప్రకటించాయి. అంతేకాదు.. ముస్లిం వర్గాల తరపున తామే పోరాటం చేస్తామని కూడా కమ్యూనిస్టు నాయకులు వెల్లడించారు.
అంతేకాదు.. తమిళనాడులో ఇటీవల జరిగిన కమ్యూనిస్టుల 24వ కాంగ్రెస్లోనూ.. వక్ఫ్కు వ్యతిరేకంగా.. తీర్మానాలు చేశారు. ముస్లిం మైనారిటీల గొంతు కోస్తున్నారని కూడా.. బీజేపీపై నిప్పులు చెరిగారు. మోడీ, ఆర్ ఎస్ ఎస్ విధానాలను ఎండగడతా మన్నారు. దీంతో ముస్లిం మైనారిటీ వర్గాలు.. కమ్యూనిస్టుల అండతో కేంద్రంపై దూకుడు పెంచి.. యుద్ధం చేయాలని నిర్ణయిం చాయి. అయితే.. అలాంటి కామ్రెడ్స్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కదం తొక్కిన మైనారిటీలపై ఉక్కుపాదం మోపింది
కేరళలోని తిరువనంతపురం, కాలికట్ సహా.. ప్రముఖ అన్ని నగరాల్లోనూ ముస్లిం మైనారిటీలు.. ఉద్యమించారు. వందలాదిగా రోడ్లపైకి వచ్చి.. బీజేపీ ప్రభుత్వాన్ని.. కేరళ లోని కమ్యూనిస్టు సర్కారును కూడా వారు ప్రశ్నించారు. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం వక్ఫ్కు వ్యతిరేమని చెప్పినా.. తీర్మానం చేసి కేంద్రానికి ఎందుకు పంపలేదన్నది మైనారిటీ వర్గాల ప్రశ్న. దీంతోనే పినరయి విజయన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు. అయితే.. దీనిని సర్దుబాటు చేయడమో..లేక, మరో రూపంలో ఉద్యమకారులను శాంతిపజేయడమో చేయాల్సిన ప్రభుత్వం.. అనూహ్యంగా రివర్స్ ఎటాక్ చేసింది.
వాటర్ క్యానన్లు, భాష్ప వాయు గోళాలు, లాఠీలతో ఉద్యమ కారులైన మైనారిటీలను పరుగులు పెట్టించి మరీ కొట్టించడం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. జాతీయ మీడియా కూడా `కమ్యూనిస్టుల ద్వంద్వ వైఖరి` అంటూ.. పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం చేయడం గమనా ర్హం. అంతేకాదు.. ఇటీవలే సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. ఎన్నికైన ఎం.ఏ బేబీ ఈ రాష్ట్రానికి చెందిన నాయకుడే కావడం.. ఆయన సైతం ఈ విషయంపై మౌనంగా ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని జాతీయ మీడియా పేర్కొంది.