మాజీ డీజీపీ గురించి గతంలో సంచలన ఆరోపణలు చేసిన భార్య పల్లవి!

V. Sai Krishna Reddy
2 Min Read

కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (68) బెంగళూరులోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన శరీరంపై పలు కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు సంబంధించి ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ఓం ప్రకాశ్ కుమారుడు కార్తికేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత వారం రోజులుగా తన తండ్రిని చంపేస్తానని తల్లి పల్లవి బెదిరిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లి, చెల్లి ఇద్దరూ డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, తరచూ తండ్రితో గొడవ పడేవారని వెల్లడించారు.

పోలీసుల విచారణలో పల్లవి మానసిక సమస్యలు, స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గతంలో ఆమె వివిధ వాట్సాప్ గ్రూపుల్లో చేసిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తన భర్త ఓం ప్రకాశ్ తనకు ఆహారంలో విషం కలిపి ఇస్తున్నారని, తనను ఇంట్లో బందీగా ఉంచారని, ఎక్కడికి వెళ్లినా ఆయన మనుషులు నిఘా పెడుతున్నారని ఆమె పలుమార్లు ఆరోపించారు.

ఓం ప్రకాశ్ రివాల్వర్‌ను వెంటనే స్వాధీనం చేసుకోవాలని కూడా ఆమె ఐపీఎస్ అధికారుల గ్రూపులో అభ్యర్థించారు. తనతో పాటు తన కుమార్తె కృతి కూడా ఇబ్బందులు పడుతోందని, బయటి నుంచి తెప్పించే ఆహారంలో కూడా భర్త సూచనల మేరకు కల్తీ చేస్తున్నారని ఆమె ఆరోపించినట్లు సమాచారం. అయితే, పల్లవి మానసిక స్థితి దృష్ట్యా ఆమె చేసిన ఆరోపణలను పూర్తిగా విశ్వసించలేమని పోలీసు వర్గాలు అంటున్నాయి.

గతంలోనూ దాడి యత్నం?

కొన్ని నెలల క్రితం కూడా పల్లవి తన భర్తపై రాయితో దాడి చేసినట్లు విచారణలో తేలింది. నిన్న ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పల్లవి, కృతి పోలీసుల అదుపులో ఉన్నారు. హత్య వెనుక పూర్తి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఉన్నత పోలీస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి ఇంట్లోనే హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *