గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) ప్రాంగణంలో జరుగుతున్న చెట్ల తొలగింపుపై సుప్రీంకోర్టు తక్షణమే స్టే విధించిన కొద్ది గంటల్లోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, ఈ సమస్యను పరిష్కరించడానికి క్యాబినెట్ స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ వివాదానికి సంబంధించి వివిధ వర్గాలతో చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. “తెలంగాణ ప్రభుత్వం మంత్రుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీలో మంత్రులు భట్టి విక్రమార్క , శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉంటారు,” అని ఆయన పేర్కొన్నారు.
ఈ కమిటీ హెచ్సీయూ కార్యనిర్వాహక కమిటీ, జేఏసీ , పౌర సమాజ సమూహాలు, విద్యార్థుల ప్రతినిధి బృందం , ఇతర సంబంధిత వాటాదారులతో చర్చలు జరుపుతుంది. గచ్చిబౌలిలోని భూ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడమే ఈ కమిటీ యొక్క ప్రధాన లక్ష్యం.
గత కొంతకాలంగా హెచ్సీయూలో జరుగుతున్న అటవీ నిర్మూలనపై తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ , బీజేపీ ప్రభుత్వపై ఒత్తిడి పెంచాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు సైతం ఈ వ్యవహారంలో సీరియస్గా స్పందించి అటవీ నరికివేతను వెంటనే ఆపాలని ఆదేశించడంతో పాటు.. అవసరమైతే అరెస్టులు కూడా చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మొత్తానికి హెచ్సీయూ వివాదాన్ని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. క్యాబినెట్ స్థాయి కమిటీ ఏర్పాటు, వివిధ వర్గాలతో చర్చలకు సిద్ధం కావడం ద్వారా ఈ సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు.. ప్రతిపక్షాల ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.