నర్సాపూర్ (ప్రజాజ్యోతి) నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ పట్టణంలోని 15వ వార్డులో రాజకీయం వేడెక్కింది. ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య మొదలైన వాగ్వివాదం కాస్తా బాహాబాహీకి దారితీయడంతో పోలింగ్ కేంద్రం పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. పోలింగ్ కేంద్రానికి వస్తున్న ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా రంగంలోకి దిగారు. తమ పార్టీకే ఓటు వేయాలంటూ అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ శ్రేణులు ఓటర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు గుంపులుగా చేరి తోపులాటకు దిగారు. గొడవ తారస్థాయికి చేరడంతో స్థానిక ఓటర్లు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
- రంగంలోకి పోలీసులు ..
పరిస్థితి అదుపు తప్పుతోందని గమనించిన ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రం వద్ద గుమిగూడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు పోలీసులు ఇరు పార్టీల నేతలను సర్దుబాటు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
