తెలంగాణ జాతిపితవు నువ్వెలా అవుతావు?.. కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి నిప్పులు

V. Sai Krishna Reddy
1 Min Read

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రావి నారాయణరెడ్డి జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన కేసీఆర్‌ను ‘తెలంగాణ జాతిపిత’ అని పిలుచుకోవడంపై ఘాటుగా స్పందించారు.

దేశం కోసం ప్రాణాలర్పించిన మహాత్మా గాంధీని జాతిపిత అంటాం. పదవుల కోసం ఆస్తులు కూడబెట్టుకున్న మీరు తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు?” అని రేవంత్ ప్రశ్నించారు. పోలీసు నోటీసులు ఇస్తే అది తెలంగాణ సమాజానికే అవమానం అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని అంబేద్కర్‌ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు.

గత ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరాం లాంటి వారిని తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. “మేము మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు కదా? గౌరవంగా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నాం. మధ్యయుగ చక్రవర్తుల్లా తాము అనుభవించే కష్టాన్ని రాజ్యం కష్టంగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి.. ఆ రాజుల కాలం ఎప్పుడో పోయింది” అని ఎద్దేవా చేశారు. వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న వారు ఉద్యమకారులు అని పిలుచుకోవడం సిగ్గుచేటన్నారు.

దేశంలో ‘వన్ నేషన్, వన్ పార్టీ’ దిశగా ప్రధాని మోదీ అడుగులు వేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కమ్యూనిస్టు నేతలకు ఆయన పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డికి రావి నారాయణరెడ్డి అవార్డు అందజేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *