నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసుల దుర్మరణం

V. Sai Krishna Reddy
1 Min Read

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల, బత్తలూరు గ్రామాల మధ్య 40వ నంబరు జాతీయ రహదారిపై ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులంతా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆరుగురు ప్రయాణిస్తున్న ఓ కారు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో, కారు ఆళ్లగడ్డ సమీపంలోకి రాగానే డ్రైవర్ అదుపు కోల్పోయాడు. దీంతో కారు వేగంగా రోడ్డు డివైడర్‌ను దాటి, ఎదురుగా హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను, క్షతగాత్రులను అతికష్టం మీద బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, వారిని మరో వాహనంలో గమ్యస్థానాలకు పంపించామని అధికారులు తెలిపారు.

కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ కె. ప్రమోద్ కుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ జాతీయ రహదారిపై తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా తెల్లవారుజామున డ్రైవర్ల నిద్రమత్తు కారణంగా అనేక దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *