మునిసిపాలిటీలకు భారీగా నిధుల విడుదల.. తక్షణమే పనులు ప్రారంభించాలని రేవంత్ ఆదేశం

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలోని పురపాలక సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి పనుల కోసం రూ. 2,780 కోట్లను విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో మొత్తం 2,432 పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో, మంజూరైన పనులకు సంబంధించి తక్షణమే టెండర్ల ప్రక్రియను ప్రారంభించి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, సమీప గ్రామాలను విలీనం చేసుకున్న పురపాలక సంఘాల్లో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టమైన సూచనలు చేశారు.

‘తెలంగాణ రైజింగ్ విజన్ 2027’లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాలను కూడా ‘గ్రోత్ హబ్’లుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిధుల కేటాయింపు జరిగిందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు మరింత ఊపందుకోనున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *