ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతంగా పేరుగాంచిన జపాన్లోని కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం పెను ప్రమాదంలో చిక్కుకుంది. ఒసాకా బే ప్రాంతంలోని రెండు కృత్రిమ దీవులపై నిర్మించిన ఈ భారీ విమానాశ్రయం క్రమంగా సముద్రంలోకి కుంగిపోతోంది. దీనిని కాపాడుకునేందుకు జపాన్ ప్రభుత్వం కోట్లాది డాలర్ల ఖర్చుతో తక్షణ చర్యలు చేపట్టింది.
1994లో ప్రారంభమైనప్పుడు కన్సాయ్ ఎయిర్పోర్ట్ సాంకేతికతకు మారుపేరుగా నిలిచింది. కానీ, అది నిర్మించిన సముద్ర గర్భంలోని మృదువైన బంకమట్టి పునాది, భారీ నిర్మాణపు బరువును మోయలేకపోతోంది. దీంతో నిర్మాణం ప్రారంభమైన 1980 నుంచి ఇప్పటివరకు ఈ విమానాశ్రయం ఏకంగా 13.6 మీటర్ల మేర కుంగిపోయింది. కార్యకలాపాలు మొదలైన తొలి 8 ఏళ్లలోనే 12 మీటర్ల కుంగుబాటు నమోదవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
విమానాశ్రయం సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ, సేవల విషయంలో మాత్రం ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది. 2024లో ప్రపంచంలోనే అత్యుత్తమ లగేజీ హ్యాండ్లింగ్ ఎయిర్పోర్ట్గా ఇది గుర్తింపు పొందింది. అదే ఏడాది దాదాపు 3.06 కోట్ల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించారు.
2018లో వచ్చిన జెబీ తుఫాను సమయంలో ఈ విమానాశ్రయం వరదల్లో చిక్కుకుని తాత్కాలికంగా మూతపడింది. ఈ ఘటనతో కుంగుబాటు సమస్య తీవ్రత ప్రపంచానికి తెలిసింది. దీంతో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం, విమానాశ్రయాన్ని కాపాడేందుకు 150 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేస్తోంది. సముద్రపు గోడలను బలోపేతం చేయడం, ప్రత్యేకమైన శాండ్ డ్రెయిన్లను ఏర్పాటు చేయడం వంటి పనులతో కుంగుబాటును అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
డిసెంబర్ 2024 నాటి గణాంకాల ప్రకారం, మొదటి దీవిలో కుంగుబాటు సగటున 6 సెంటీమీటర్లకు తగ్గింది. అయితే, రెండో దీవిపై పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అక్కడ సగటు కుంగుబాటు 21 సెంటీమీటర్లుగా నమోదైంది. ఈ ఇంజినీరింగ్ అద్భుతాన్ని ప్రకృతి శక్తుల నుంచి కాపాడుకోవడం జపాన్కు పెద్ద సవాల్గా మారింది.