సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఓ జంట తప్పుడు దారి పట్టింది. తమ లైంగిక కార్యకలాపాలను మొబైల్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ పోలీసులకు చిక్కింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని అంబర్పేటలో వెలుగుచూసింది. అశ్లీల దందా నిర్వహిస్తున్న భార్యాభర్తలను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అంబర్పేటలోని మల్లికార్జున నగర్లో నివసించే 41 ఏళ్ల వ్యక్తి, అతని 37 ఏళ్ల భార్యను అదుపులోకి తీసుకున్నారు. వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్గా పనిచేసే వ్యక్తి, భార్యతో కలిసి ఈ అశ్లీల దందాకు తెరలేపాడు. ఓ మొబైల్ యాప్ ద్వారా యువతను లక్ష్యంగా చేసుకుని, లైవ్ వీడియోలు, రికార్డ్ చేసిన క్లిప్పులను అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. లైవ్ వీడియో చూడాలంటే రూ. 2000, రికార్డ్ చేసిన క్లిప్ కావాలంటే రూ. 500 చొప్పున వీరు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
ఈ వ్యవహారం కోసం వారు అత్యాధునిక హెచ్డీ కెమెరాలను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. తమ గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు లైవ్ స్ట్రీమింగ్ సమయంలో ముఖాలకు మాస్కులు ధరించేవారని వెల్లడించారు. ఈ అక్రమ సంపాదన, క్యాబ్ డ్రైవర్గా వచ్చే ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఉందని విచారణలో దంపతులు అంగీకరించినట్లు సమాచారం.
ఈ దందాపై పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ బృందాలు గురువారం వారి ఇంటిపై దాడి చేశాయి. ఈ సోదాల్లో లైవ్ స్ట్రీమింగ్కు ఉపయోగించే హెచ్డీ కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దంపతులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
అరెస్టయిన దంపతులపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ రాకెట్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు వారు వివరించారు.