ఇరాన్ క్షిపణి దాడి.. ఖ‌తార్‌లోని భారతీయుల‌కు అల‌ర్ట్‌

V. Sai Krishna Reddy
1 Min Read

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఖతార్‌లోని అల్ ఉదెయిద్ అమెరికా వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ సోమవారం క్షిపణి దాడులకు పాల్పడింది. అయితే, ఈ దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ అధికారులు తెలిపారు. వారాంతంలో తమ అణుకేంద్రాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకార చర్యగా ఇరాన్ ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడున్న భారతీయులకు కీలక సూచనలు జారీ చేసింది.

సోమవారం జరిగిన ఈ ఘటన అనంతరం, ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా స్పందించింది. “ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఖతార్‌లోని భారతీయ సమాజం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోనే ఉండండి. దయచేసి ప్రశాంతంగా ఉండండి. స్థానిక వార్తలు, ఖతార్ అధికారులు అందించే సూచనలు, మార్గదర్శకాలను పాటించండి. రాయబార కార్యాలయం మా సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా కూడా అప్‌డేట్ చేస్తూ ఉంటుంది” అని భారతీయులకు ఎంబ‌సీ విజ్ఞప్తి చేసింది. ఈ దాడుల వల్ల ఖతార్‌లో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు, ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ గగనతలం, భూభాగం సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ సాయుధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని పునరుద్ఘాటించింది. పౌరులు, నివాసితులు కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని, సూచనలను మాత్రమే పాటించాలని విజ్ఞప్తి చేసింది.

కాగా, ఈ దాడులకు పాల్పడటానికి ముందే రెండు దౌత్య మార్గాల ద్వారా అమెరికాకు ఇరాన్ సమాచారం అందజేసిందని ఓ సీనియర్ ప్రాంతీయ అధికారి తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ పరిణామం ప్రాంతీయంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ఖతార్ ప్రభుత్వం భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *