గుడ్ ఫ్రైడే (ఏప్రిల్ 18) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వేలాది మంది పాస్టర్లకు గౌరవ వేతనం విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 8,427 మంది పాస్టర్లకు ప్రయోజనం చేకూరనుంది. వీరికి నెలకు రూ. 5,000 చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు. 2024 మే నెల నుంచి నవంబర్ నెల వరకు, అంటే ఏడు నెలల కాలానికి సంబంధించిన బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం, అర్హులైన ప్రతి పాస్టర్కు ఈ ఏడు నెలలకు కలిపి మొత్తం రూ. 35,000 గౌరవ వేతనం అందనుంది.
గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ‘యువగళం’ పాదయాత్ర సమయంలో పలు సందర్భాల్లో పాస్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశాల్లో, తమ కూటమి అధికారంలోకి వస్తే పాస్టర్లకు గౌరవ వేతనం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇచ్చిన మాట ప్రకారం ఈ హామీని అమలు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.